విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి

May 8,2024 21:01 #died, #formers

ప్రజాశక్తి-పుట్లూరు, కళ్యాణదుర్గం:తాము సాగు చేసిన పంటలను దక్కించుకునేందుకు నీరుపెట్టేందుకు పొలం వద్దకు వెళ్లిన రైతులు విద్యుదాఘాతంతో మరణించారు. అనంతపురం జిల్లాలో వేర్వేరు చోట్ల ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. తోటి రైతుల కథనం ప్రకారం.. పుట్లూరు మండలం యల్లనూరు మండలం గడ్డవారిపల్లి గ్రామానికి చెందిన రైతు గోపాల్‌ రెడ్డి (56) బుధవారం ఉదయం తన పంటకు నీరు పెట్టేందుకు వెళ్లారు. మోటార్‌కు విద్యుత్‌ వైర్లను తగిలిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించారు. సమీప రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
కళ్యాణదుర్గం మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన మనోహర్‌ (32) టమోటా పంటకు నీరు పెట్టేందుకు తన పొలానికి వెళ్లారు. ఈ సమయంలో మోటార్‌ వద్ద ఉన్న విద్యుత్‌ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించారు.

➡️