ఘోర దుర్ఘటన – అమెరికాలో హెలికాప్టర్‌ కూలి బ్యాంకు సీఈవో సహా ఆరుగురు మృతి

అమెరికా : ఇటీవలే అమెరికాలోని శాన్‌ డియాగో వద్ద ఓ సైనిక హెలికాప్టర్‌ కూలి ఐదుగురు మెరైన్‌కోర్‌ సిబ్బంది చనిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకే మరో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. గత శుక్రవారం రాత్రి అమెరికాలోని హెలికాప్టర్‌ అదుపుతప్పి కుప్పకూలిపోవడంతో నైజీరియాకు చెందిన అతి పెద్ద బ్యాంక్‌ సీఈవో సహా ఆరుగురు మృతి చెందారు.

గత శుక్రవారం రాత్రి సమయంలో అమెరికాలోని కాలిఫోర్నియా-నెవడా సరిహద్దుల్లో ‘యాక్సెస్‌ బ్యాంక్‌’ సీఈవో హెర్బర్ట్‌ విగ్వే తన భార్య, కుమారుడు మరికొందరితో కలిసి యూరోకాప్టర్‌ ఈసీ 130 లో మోజువా ఎడారిపై ప్రయాణిస్తుండగా, శాన్‌ బ్రెనార్డినో కౌంటీ వద్ద దాదాపు 3 వేల అడుగుల ఎత్తు నుంచి హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘోర దుర్ఘటనలో హెలికాప్టర్‌లోని వారంతా మృతి చెందారు. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న ఐ-15 జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నవారు ప్రమాదాన్ని గమనించి వెంటనే 911కు కాల్‌ చేశారు. ఈ ప్రమాదంపై ఎఫ్‌ఏఏ దర్యాప్తు చేపట్టింది. మృతుల్లో నైజీరియాకు చెందిన ఎన్‌జీఎక్స్‌ గ్రూపు మాజీ ఛైర్మన్‌ అబింబోలా, ఇద్దరు పైలట్లు కూడా ఉన్నారు. ‘ఆఫ్రికా బ్యాంకింగ్‌ రంగానికి ఇది పెద్దషాక్‌’ అని వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎవాలా ఎక్స్‌లో పోస్టు చేశారు. హెర్బర్ట్‌ విగ్వే గతంలో గ్యారెంటీ ట్రస్ట్‌ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. నైజీరియా ‘యాక్సెస్‌ బ్యాంక్‌’ ఆఫ్రికాలోని పలు దేశాల్లో సేవలందిస్తోంది.

➡️