చెన్నై : మిచౌంగ్ తుఫాను ప్రభావానికి చెన్నై అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. తాజాగా బుధవారం చెన్నై వెలచ్చేరిలో ఓ ప్రైవేట్ భవనం కుప్పకూలి ముగ్గురు మృతి చెందారు. చెన్నై – వెలచ్చేరి ప్రధాన రహదారిపై గ్రీన్ టెక్ స్ట్రక్చరల్ భవనం కుప్పకూలడంతో భవనంలో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రాంతాన్ని ఎంపి తిరుమావళవన్ సందర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. బుధవారం తమిళనాడులో భారీ వర్షాలు కురిశాయి. తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో అత్యధికంగా 8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. పుదుక్కొట్టారు జిల్లాలో పొన్నమరావతి, దిండిగల్ జిల్లాలోని నాథమ్, శివగంగై జిల్లాలోని సింగంపునరి, మదురై జిల్లాలోని సత్తియార్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని పలు వీధులు నీటమునిగాయి. పడవల సహాయంతో రెస్క్యూ సిబ్బంది ప్రజలను రక్షిస్తున్నారు.