ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం మొవ్వ మండల కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొవ్వ మండల పరిధిలోని వీరాయలంక గ్రామంలో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను శుక్రవారం ఉదయం పరిశీలించారు. కూలీలకు మజ్జిగ పంపిణీ చేయటం లేదని, పని ప్రాంతంలో టెంట్ ఏర్పాటు చేయటం లేదని కూలీలు వివరించినట్లు తెలిపారు. మజ్జిగ పంపిణీ నిధులను కూలీల ఖాతాకు జమ చేస్తామని అన్నారు. కానీ నేటి వరకు జమ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ మస్టర్ విధానాన్ని రద్దుచేసి, పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు, కూలీలకు రోజువారీ వేతనం 600 రూపాయలు ఇవ్వాలని, 200 పని దినాలు కల్పించాలని కోరారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు 26 వేల రూపాయలు జీతం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పలపు వెంకటాద్రి సిపిఎం నాయకులు మద్దుల బసవయ్య, కొనకళ్ళ రాంబాబు, జన్నలగడ్డ వాసు పాల్గన్నారు. అనంతరం కూలీలకు బిస్కెట్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.